పాతికేళ్ళనాటి మాట....
మనసైన దేవుడికి మనసులో గుడికట్టుకుంటే చాలా? తెల్లారే దణ్ణంపెట్టుకుని, రోజూ దీపం, ఏడాదికోసారి పెళ్ళీ, తోచినంత సాయం...ఈ సూత్రాలే ఆధారంగా మా నాన్నగారి ఆధ్వర్యంలో విశాలాక్షినగర్లో ఒక రామాలయం నిర్మించారు.
అది రోజురోజుకీ అభివృద్ధిచెంది ఇవాళ్టికి ఒక ఆలయ సముదాయంగా మారిపోయింది. రాముడు విరాముడైపోయాడు. మిగిలిన దేవుళ్ళందరూ సభ్యులుగా చేరేటప్పటికి ఆ గుడికి రంగుతోపాటు పరిమళమూ అబ్బింది.
ఈరోజు అక్కడ అత్యంత వైభవంగా జరిగిన సీతారామకళ్యాణాన్ని చూడ్డానికి బుడిబుడి అడుగుల నాన్నగారిని తీసుకెళ్ళాం. ఆ వైభోగాన్ని చూసినవారికి గతస్మృతులు కళ్ళముందు తిరగడంలో ఆశ్చర్యమేఁవుంది?
******** *********** *********** *******
"ప్రతియేడూ ఇలానే చేస్తున్నారు. కళ్యాణానికి కూర్చుందామనుకోడం, జమాబందీలో, ఇనస్పెక్షనో అని పరిగెట్టడం. ఈమారేనా అవుతుందా? మీ డీటీగారికి ముందే చెప్పేసెయ్యండి!"
అమ్మ ఆవేదనలో అర్ధముంది.
అదేంటో అందరూ పందిట్లో సందడిగా కనబడేవారు. ఎంతబావుంటుంది ఆసందడి? మనింట్లో పెళ్ళిలా ఓ..తిరిగేస్తూ వుంటారు నాన్నగారు.
నెలముందునించీ పోగేసిన చందాలతో పొడుగాటి పందిరేసేవారు. పందిరిరాటలకి ట్యూబులైట్లు కట్టి రాత్రంతా రంగుకాయితాలు అంటించి, మెరుపుల బుట్టలు కట్టి, అరటిచెట్లు, పువ్వులతో మండపం చుట్టూ అలంకారం చేసేవారు.
పొద్దున్నే గుడికెళ్ళి చూస్తే ఆశ్చర్యమేసేది. రాత్రెవరైనా దేవతలొచ్చి చేసేసారా ఇదంతా అని! ఎవర్ని చూసినా ఏంటో హడావుడిగా చంకలో ఏవో పుస్తకాలు పెట్టుకుని తెగతిరిగేస్తూ వుండేవారు.
"మంచినీళ్ళ డ్రమ్ములు నింపారా?"
"మిరియాలు చాలవయ్యా! మరిన్ని కలుపు. పానకం రుచిరాదు."
"అరిటాకులు కావాల్ట! శేషగిరిగారింటికెళ్ళి త్వరగా తెచ్చెయ్! ఇక్కడున్నట్టు రావాలి"
"మీరు కళ్యాణానికి కూర్చుంటున్నారా?"
"నేను కూర్చుంటే ఎక్కడవుతుందండీ? అంతా పిల్లమూక. కిష్కింధ చేసిపడేస్తారు."
ఎవరికివారే బాధ్యతవహించేవారు.
పనెగ్గొట్టడం అప్పటికింకా అలవాటవ్వలేదు. పక్కవాణ్ణి తొక్కెయ్యడమూ అప్పటికి తెలీదు. అంతా రామసామ్రాజ్యం.
పనెగ్గొట్టడం అప్పటికింకా అలవాటవ్వలేదు. పక్కవాణ్ణి తొక్కెయ్యడమూ అప్పటికి తెలీదు. అంతా రామసామ్రాజ్యం.
'అయోధ్యలో పట్టాభిషేకానికైనా అంత హడావిడి చేసుంటాడా దశరథుడూ?' అనిపించేది.
ఎవర్ని చూసినా మారువేషాల్లో తిరుగుతున్న గుహుళ్ళాగా, భరతుళ్ళాగా, ఇంకొకరు సుగ్రీవుడేనేమో అనిపించేవారు తప్ప వీళ్ళపేర్లు భాస్కర్రావు, సోమయాజులు, సూర్నారాయణ అనిపించేది కాదు.
ఆ మోహన్రావుగారైతే నిజంగా హనుమంతుడే అనిపించేసేవాడు. ఆ వారంరోజులూ మనం ఎప్పుడెళ్ళినా గుళ్ళో కనబడేవాడు. రాముడైనా సాయంత్రం అలా ఊరేగింపుకెళ్ళేవాడేమోగానీ ఆయనమాత్రం నిరంతరం బందిఖానాలో రామదాసులా అక్కడే వుండేవాడు.
ఆడవాళ్ళయితే కట్టినదండలు కట్టినట్టే వుండేవారు.
కంటికి కనబడని ఆయన పెళ్ళికి ఇంత సందడెందుకో మాకర్ధమవ్వడానికి రామాయణం చదవడమే మార్గమని తోచింది. దొరికిన పుస్తకం దొరికినట్లు చదివేసేవాళ్ళం. ఎన్ని సార్లు చదివినా 'ఏదీ మరియొకసారీ!' అనిపించేది.
మాయామర్మం లేని వ్యక్తిత్వం, మంత్రతంత్రాల్ని నమ్ముకోని జీవితం, అందర్నీ కలుపుకుపోయే సిద్ధాంతం...ఇవన్నీ ఎవరూ బోధించకుండానే అర్ధమైపోయాయి. ఎందుకంత ఆర్భాటం చేస్తున్నారో తెలిసిపోయింది!
'ఈయనకిలాగే అవ్వాలి..!' అనుకున్నాం!
అక్కణ్ణించి మేంకూడా ఉడతల్లాగా వాళ్ళ కాళ్ళకడ్డం పడుతూ మాకు తోచిన సాయం చేసేవాళ్ళం. ప్రసాదం పొట్లాలు కట్టడం,
పానకం గ్లాసులు అందించడం,
అందర్నీ వరసల్లో కూర్చోబెట్టడం...
ఇలాంటివన్నమాట!
పానకం గ్లాసులు అందించడం,
అందర్నీ వరసల్లో కూర్చోబెట్టడం...
ఇలాంటివన్నమాట!
దేవగణాన్నంతటినీ పెళ్ళికి ఆహ్వానించి, రాముడిదీ, సీతమ్మదీ వంశవృక్షం చదివి, గంట గడిచేకొద్దీ మరింత ఆసక్తికరంగా కంచుకంఠంతో మండపాన్నంతటినీ ఆక్రమించుకునే ఆ బ్రహ్మగారిని చూస్తే సాక్షాత్తూ వసిష్టుడే వచ్చేసాడా అనిపించేది.
మంగళసూత్రాల్ని అందరి మెడలకీ తాకించి, అక్షింతలిచ్చేసేవారు. పానకం ఘాటొకపక్క, ఎండ వేడి ఒకపక్కా వున్నా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఆ మధురక్షణం అపరాహ్ణవేళ అంతవేడిలోకూడా చల్లని పిల్లతెమ్మెరలా అనిపించేది.
తాళిబొట్టు పైకెత్తి చూపించగానే ఆనందంతో కన్నీటిబొట్టు రాలేది ప్రతివాడికీ! దానికితోడు ఇంకా కిర్రెక్కించడానికి సన్నాయివాళ్ళు ఓమూల చెమటలు కక్కుతూనే "సీతమ్మ పెళ్ళికూతురాయెనే..మా రామయ్య పెళ్ళికొడుకాయెనే!" అన్నపాట ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టినట్టు జోరుగా వాయించేసేవారు.
ఆశబ్దంలో మహిమో, వేదమంత్రాల పటిమో తెలీదుగానీ అందరూ ముగ్ధమనోహరమైన
ఆ దృశ్యం చూసి ఈలోకంనించి అదృశ్యమైపోయేవారు.
ఆ దృశ్యం చూసి ఈలోకంనించి అదృశ్యమైపోయేవారు.
అలా కాసేపు మిథిలానగరానికెళ్ళి మళ్ళీ ఈ మిథ్యాప్రపంచానికి వచ్చేసేవారు.
ఎందుకు చెయ్యాలి రాములోరికి కళ్యాణం?
ఎవరేనా నీకు నచ్చితే వాళ్ళ పుట్టిన్రోజు చేసుకుంటావు. అభిమాన సంఘం పెట్టి అన్నదానం చేస్తావు. కష్టమొస్తే రక్తమిస్తావు. కష్టమనిపిస్తే రక్తం కళ్ళజూస్తావు. ఇదంతా భక్తి. మూఢమో, గాఢమో...ఏదైనా భక్తే!
అలాగే రాముడు కూడా ఈదేశప్రజలకి గుండె చప్పుడు. నడిపించే మార్గం. మనిషిలా ఎలా బ్రతకాలో చెప్పిన దేవుడు. ఆయనకి కూడా బ్రతుకంతా ఒడుదుడుకులే...మీ హీరోలకి మల్లే!
కానీ అకుంఠిత దీక్షతో నిండిన ధర్మపాలన, పెద్దలపట్ల గౌరవం. ఇవి ఆయనకి అత్యంత ప్రాచుర్యాన్ని తెచ్చాయి. ఎటువంటి ప్రచారపటాటోపం లేని ప్రజాశక్తి ఆయన.
కళ్యాణం చెయ్యండి. పదిమందికి అన్నం పెట్టండి. పుణ్యం మూటకట్టండి.
రామాయ! రామభద్రాయ!! రామచంద్రాయనమః
............జగదీష్ కొచ్చెర్లకోట
0 comments:
Post a Comment