"అన్నయ్య వెళ్ళే బడికే వెళతానంటున్నాడు. యూపీ స్కూలుకెళ్ళట్ట!" నామాట అమ్మ నోట.
"ఎందుకట? అది స్కూలుకాదా, మేష్టర్లుండరా?" అప్పుడే ఇంటికొచ్చి మేకుకి చొక్కా తగిలిస్తున్న నాన్నగారి గొంతులో అప్పుడే చిరాకు.
"వాణ్ణే అడగండి. పిల్లిలా దాక్కున్నాడు."
"వాడికి భయం నాన్నగారూ! ఒక్కడూ వెళ్ళలేడు."
అన్నయ్య మొత్తంమీద సర్దిచెప్పబట్టి మనం 'డిఫరెంట్ స్కూల్' మెట్లెక్కాం.
తెలుక్కి జోగినాయుడు మేష్టరొచ్చేవారు. ఈయన ఇంటిదగ్గర ప్రెవేట్లు చెప్పేవారు. క్లాసులో సగంమంది వెళ్ళేవారు.
"ఒరేయ్! జన్మపరంపర పాటంలో ప్రెశ్నొస్తే నేను మొన్నిచ్చిన....ఏది?....ప్రెవేట్లోది...అదంతా రాసీయండి. స్టావు స్టావంతా నింపీయండి. ఎవడేనా అరస్టావు రాసేడో....ఆడికి ఈపిమానం మోతే!"
"ఒరేయ్ దుర్గా, ప్రెవేట్లోదంటారేంట్రా? నీదగ్గరుంటే ఇవ్వరా!" అడగడం, దుర్గారావుగాడు నిరాకరించడం అయ్యాయి.
తీరా మార్కులు చూస్తే నాకే ఎక్కువొచ్చాయి. ఆయన పేపర్లు పట్టుకుని పేరుపేర్నా ఇస్తూ
"ఫస్టు...అనంత వెంకట సూర్య జగదీశ్వర.....ఎవడ్రాయీడు? ఇంత పొడుగు పేరెట్టుకున్నాడు. లేచినిలబడు!" అదేదో నాతప్పన్నట్టు గద్దించారు.
నేన్నిలబడగానే "నువు మాప్రెవేట్లో వాడివేనా?" అనడిగారు.
"వీడు కొత్తగా వచ్చాడు సార్! ట్రాన్స్ఫర్ మీద!" అని దుర్గాగాడు అనగానే
"సర్సర్లే! కూచో!" అన్నారు అసహనంగా.
ఇలాగేవుంటారా మేష్టర్లందరూనూ? అని భయపడ్డాను.
ఇంగ్లీషు, లెక్కలు ఒకాయన, ఎన్నెస్సు, పీయెస్సు ఒకాయన చెప్పేవారు. వాళ్ళిద్దరూ పంచిన జ్ఞానం, విజ్ఞానం అమోఘం.
ఇక సోషలుకి పియ్యెస్సారనే ఆయన వచ్చేవారు. ఆయన పేరెవరికీ తెలీదు. సుబ్బారావో, సోమేశ్వర్రావో అయుండాలి. ఆయన ఒకోరోజు ఒక్కో వేషంలో వచ్చేవారు.
ఒకసారి గోచీపోసి పంచెకట్టుకుని, నిలువునా తిరునామం పెట్టుకొచ్చారు. పిల్లలంతా ఒకటే నవ్వు.
కానీ ఆయన సిపాయిల తిరుగుబాటు పాఠం చెప్పారంటే అందర్నీ బండెక్కించి పద్దెనిమిదొందల ఏభయ్యేడుకి తీసుకుపోయేవారు. బ్రిటీషువాళ్ళ దుర్మార్గప్పనులు వర్ణిస్తోంటే స్కూలు బెంచీల్ని కసిగా నొక్కేస్తుండేవాళ్ళం.
'అదే నాచేతిలో తుపాకీ వుండుంటేనా...అందర్నీ ఢాంఢామ్మని పేల్చిపడేసేవాణ్ణి!' అని మొత్తం పిల్లలంతా అనుకునేవాళ్ళం.
మధ్యమధ్యలో ఆయన ఆవేశాన్నాపుకోలేక 'డామ్ బాస్టర్డ్స్..ఇడియట్స్!' అని తిట్టేస్తూవుండేవారు ఆంగ్లేయుల్ని. ఆగొంతువింటే మాకు రక్తం మరిగిపోయేది. మేఁవందరం తిలక్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాదుల్లా ఫీలైపోతుండేవాళ్ళం.
తెలుగుమేష్టారికి ట్రాన్స్ఫరైపోయి మరొకాయన వచ్చారు. ఈయన పద్యాలన్నీ రాగయుక్తంగా పాడేవారు.
'అతుల పరాక్రమార్జితమ్ములైన....' ఇది మన ఫేవరెట్ పద్యం. ఆయన నేర్పించడం, నేనెన్నో పోటీల్లో పాడి బహుమతులు గెలుచుకోడం...ఇంత చరిత్రున్న పద్యమది.
"పిల్లలమర్రి పినవీరభద్రుడు ఇలా కళ్ళెర్రజేసీటప్పటికి సరస్వతీదేవి పరెట్టుకుంటూ వెళిపొచ్చిసీది! ఆవిడకంత భయం ఆయనంటేనీ!" చక్రాల్లాంటి గుండ్రటి కళ్ళు ఇప్పటికీ గుర్తే నాకు.
ఆ కవి విద్వత్తుని వర్ణించడానికలా చెబుతున్నారని మాకర్ధమయ్యేదికాదు. నిజమనుకునేవాళ్ళం.
ఒకసారి కన్నప్ప పాఠం మధ్యలో ఈశ్వరుడు ప్రత్యక్షం కాలేదని చెబుతూ ఏడ్చేసారాయన! మాక్కూడా దుఃఖం తన్నుకొచ్చేసి చొక్కాల్తో తుడిచేసుకున్నాం.
ఈకథలన్నీ ఇక్కడితో అయ్యేవికావు. ఇంటికొచ్చి లవకుశలో పిల్లల్లాగా చిడతల్లేకుండా ఇంటిల్లిపాదికీ పూసగుచ్చినట్లు వర్ణించేవాణ్ణి.
చిన్నతనాన పడిన బీజాలు వటవృక్షాలైపోతాయి. వారందరూ పెట్టిన భిక్షే ఈరోజింత అన్నం పెడుతోంది.
చేసే పనిపట్ల నిబద్ధత, సమగ్రత, ఆపని తన సొంతమనుకోడం.... ఇవే కాకుండా ఎలా వుండకూడదో కూడా నేర్పించారు అనేకమంది గురువులు. అందరికీ వందనాలు.
............జగదీష్ కొచ్చెర్లకోట
0 comments:
Post a Comment