Latest Posts

Content

Friday, March 15, 2024

మావూరు అనకాపల్లి

ఊరనగా ఎంతా, ఆమూల గాంధీనగరంలో నడవటం మొదలెడితే సత్యనారాయణ థియేటర్ చేరేసరికి ఇరవైనిముషాలు పట్టేది. ఇప్పట్లా బరువనీ, పరువనీ ఇబ్బందులు లేని వయసాయె. 

నేను ఎనిమిదీ తొమ్మిదీ తరగతుల్లో ఉండగా ఊరికి నడిమధ్యలో ఉండే నరసింగరావుపేటనించి బ్రాహ్మలెక్కువగా ఉండే గాంధీనగరానికి మకాం మార్చారు నాన్నగారు. ఆ ఇంటి గురించి ఇదివరకు చెప్పుకున్నాం, ఇంటిముందు పున్నాగపూల చెట్టూ, ఇంటి పంపరపనస చెట్టూ ఉండేవని. నాకైతే ఆ ఇంటితో చాలా జ్ఞాపకాలున్నాయి. వీధంతా అచ్చుపోసినట్టు శుభ్రంగా ఉండేది ఎప్పుడూ. ఇంటికెదురుగా మా జువాలజీ లెక్చరర్‌గారిల్లు, ఇంటిపక్కనే పేద్ద మఱ్ఱిచెట్టూ ఉండేవి.పున్నాగపూల ముందుకెడితే వీధి మొదట్లోనే కుముదవల్లి టీచరుగారిల్లు. ఆవిడంటే మాకందరికీ విపరీతమైన అభిమానం. నాకు ఈమాత్రం తెలుగదీ వచ్చిందీ అంటే అటువంటి పంతులమ్మల దయే! వాళ్ల పిల్లలు మా అన్నయ్యకీ నాకూ సరి ఈడువాళ్లే అయినా వాళ్లంతా వేరే ప్రైవేట్ స్కూల్లో చదివేవారు. 

నా టెన్త్‌ అవగానే మళ్లీ ఊళ్లోకి కాపరం మార్చేశారు నాన్నగారు. ఈమారు కాస్త ఎత్తరుగులిల్లు. ముందున్న గదులు మూడూ దాటి వెనక్కి వెడితే కాస్తంత ఖాళీ జాగా, ఆ తరవాత వంటగదీ ఉండేవి. వర్షం పడిందంటే తడుస్తూ వెళ్లాలన్నమాట. అవోరకం ఇళ్లు! ఇంటిపక్కనే సర్వకామదాంబ పార్కుండేది. అక్కడికి అన్నిపత్రికలూ వచ్చేవి. ముఖ్యంగా అన్ని దినపత్రికలతో పాటు స్క్రీన్ అనే మాగజైన్ వచ్చేది గుర్తుందా? ఇప్పటి వార్తాపత్రికలకన్నా చాలా పెద్ద పేజీలుండేవి. సినీబ్లిట్జ్ అంటూ మరొకటి. ఇక రంగురంగుల విజయచిత్ర, జ్యోతి మాసపత్రిక వచ్చేవి. యువ సరేసరి, అది మన ఫేవరెట్టనుకోండి. అందులో కథలన్నిటికీ ఒక స్థాయి ఉండేది. శ్రీయుతులు ఇచ్ఛాపురపు జగన్నాథరావు, రామచంద్రరావు, అవసరాలవారు... ఇలా అద్భుతమైన రచయితల కథలన్నీ చదివి వాటిద్వారా అక్షర రమ్యతను, వాక్యనిర్మాణాన్ని, కథను ఎత్తుకొనే విధానాలను శ్రద్ధగా అధ్యయనం చెయ్యగలిగాను. 

అయితే సర్వకామదాంబ పార్కుకి ఇంకో విశేషం ఉంది. పొడుగాటి అశోకవృక్షాలు, ఇంకా బోల్డన్ని క్రోటన్స్ మధ్యలో విశాలమైన పెంకుటింటి లైబ్రరీ అది. అక్కడ సిమెంటు బెంచీలమీద ప్రతి సాయంకాలం చేతికర్రలు, తెల్ల లాల్చీపైజమాలు, తాడుకట్టిన కళ్లజోళ్లవాళ్లందరూ చేరేవారు. అందరికీ తుప్పు సోలతో శనక్కాయలు కొలిచేవాడు కూడా నాతోపాటు నిత్యం హాజరేయించుకునే విద్యార్ధే. చీకటిపడుతుండగా మైకులోంచి ప్రాంతీయ వార్తలు వినిపించేవి. అవి పూర్తవగానే పొలం పనులు. వేరుసెనగ పంటలో సస్యరక్షణా అదీ ఇదీ అంటూ అన్నీ వినేవాణ్ణి. ఆ మాట్లాడే తీరు, కులాసాగా కబుర్లాడుతూనే పంటల్ని కాపాడుకునే విధానాన్ని బోధించడం, ఇవన్నీ అలవోకగా చేసిపడేసే ఆ రేడియో కళాకారులంటే ఎంతో మమకారం ఏర్పడిపోయింది.

ఇక మా హైస్కూలు గ్రౌండు దాటగానే చిన్న మలుపొస్తుంది. అక్కడుండేది శారదా గ్రంథాలయం. అనకాపల్లి వర్తకసంఘం వారి దాతృత్వంతో నడపబడే ఆ లైబ్రరీలో చాలా గదులుండేవి. నేను వారంలో కనీసం రెండు మూడుసార్లయినా అక్కడికి వెళ్లేవాణ్ణి. నాలుగైదు మెట్లు ఎక్కగానే ఒక ఊహాలోకంలోకి స్వాగతం పలుకుతూ అద్దాల తలుపులున్న హాలొకటి దర్శనమిస్తుంది. అందులో ఏడాదిపొడవునా వచ్చిన చందమామలు, బొమ్మరిల్లులు, బాలమిత్రలు బైండ్ చేసి ఉంచేవారు. జనవరి నుంచి డిసెంబరు వరకూ సంవత్సరాల వారీగా క్రమపద్ధతిలో పెట్టే ఆ పుస్తకాలు తెరిస్తే నా ఉనికి అనకాపల్లిలో కాదు. ధర్మవరం అనే గ్రామానికో, రాకాసిలోయలోకో, కురుక్షేత్ర యుద్ధం జరిగేచోటుకో వెళిపోయేవాణ్ణి. అంతలా కట్టిపడేసే సరళమైన కథలు, వాటికి తగ్గట్టుగా రంగురంగుల బొమ్మలు చూస్తూ ఎంతలా పరవశించిపోయేవాణ్ణో!

ఇక లోపలుండే హాలు బాగా విశాలమైనది. అక్కడన్నీ దినపత్రికలు, రీడర్స్ డైజెస్ట్, కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ, సైన్స్ టుడేలు ఇంకా సోవియట్ లాండ్, స్పుత్నిక్‌లాంటి అనేక పత్రికలుండేవి. తెలుగులో యువలు, జ్యోతులు మామూలే! 

అట్నించి ఎడమవైపుకి తిరిగితే ఏవో గదులుండేవిగానీ మేం చిన్నపిల్లలమని లోపలికి రానిచ్చేవారుకారు.

ఏదైతేనేం, ఈ శారదా లైబ్రరీ అనేది కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా మేడమీద గదుల్లో ఇంగ్లీష్ గ్రామర్ క్లాసులు, హిందీ శిక్షణాతరగతులు, సంగీతపాఠాలూ కూడా నిర్వహించేది. 

ఇదంతా ఇప్పుడెందుకంటే నా జీవితంలో భాషపట్ల మమకారం, గౌరవం, కాస్తంత పట్టూ ఏర్పడటానికి అనకాపల్లిలో ఈ ప్రదేశాలు, వ్యక్తులు ఎంత దోహదపడిందీ చెప్పడానికే!

దాదాపు నలభయ్యేళ్ల తరవాత మొన్నాదివారం నాకు మళ్లీ అనకాపల్లి వెళ్లాలనిపించింది. తనతో చెప్పగానే వెంటనే ఒప్పుకుంది. కాస్తంత పులిహోరా, దద్దోజనం కలిపి క్యారియర్ సిద్ధంచేసి పదమంది. పిక్నిక్కన్నమాట.

వెళుతూ వెళుతూ దారిలో మా చెల్లినీ వెంటబెట్టుకుని ఊరు చేరాం. ముందుగా నూకాలమ్మ దర్శనం చేసుకుని అట్నించటే గాంధీనగరానికి వెళిపోయాం. 

అదిగో, అప్పట్నుంచి మాకు షాకులు మొదలయ్యాయి. నలభయ్యేళ్లకు పూర్వం మేమున్న ఆ ఇల్లు ఇప్పటికీ అలానే ఉంది. ఇంట్లో అద్దెకున్నవారి అనుమతితో లోపలికెళ్లి చూస్తే ఆదిత్య 369 సినిమాలోలా టైమ్ మెషీన్ ఎక్కి మేవుఁన్న కాలానికి వెళిపోయాం. అవే తలుపులు, అదే బావి. ఆఖరికి గదిమధ్యలో చెక్కుచెదరకుండా పడున్న భోషాణంతో సహా! పెరట్లో పంపరపనస చెట్టు మాత్రం లేదు. అయ్యో అనిపించింది. పురుగు పట్టేసిందని తీసేశార్ట. అరటి, మారేడు మాత్రం కనబడ్డాయి. 

ఆయింటిని చూడగానే నిక్కరేసుకుని ఇల్లంతా కలియదిరిగే పదిహేనేళ్ల బక్కపిల్లాడొకడు కనబడ్డాడు. 

....టెన్త్‌క్లాసు రిజల్ట్స్ పేపర్లో ఫస్ట్‌క్లాసని చూడగానే పరుగెత్తుకుంటూ వచ్చి ఆయాసపడుతూ మొట్టమొదట అమ్మకే చెప్పినవాడు. 

....ఇంటిచూరులో ఒక పెంకుకి బదులు అమర్చిన అద్దంలోంచి పడే ఎండకిరణాలకి భూతద్దం అడ్డుపెట్టి సినిమా వేసినవాడు. 

....పంపరపనస తొనల్ని బళ్లోకి పట్టుకెళ్లి స్నేహితులందరికీ పంచిపెట్టినవాడు. 

........ఏదో సన్నటి కన్నీటిపొర నా కంట్లో! అదేం రోగమో, గతమంటే నాకింతలా మమకారం! 

మాయింటిని ఆనుకుని ఉండే సరిపల్లివారింటి తలుపు కొట్టాం. ఇప్పుడు మరొక షాకు. ఆ మనుషులందరూ వరసగా కనబడి ఆప్యాయంగా పలకరించారు. పెద్దన్నయ్య, అక్క గురించి ప్రశ్నించారు. అమ్మానాన్నల వివరాలడిగారు. మాతో కలిసి ఇంటికెదురుగా ఉండే రాజా కాలేజీకి వచ్చి అన్నీ చూపించారు. అప్పటి కబుర్లు, ఆడుకున్న ఆటలు, ఆఖరికి వాళ్లింటి పెరట్లో ఉండే పెద్ద పుట్టా, అందులో ఒకసారి మాకు కనబడిన పడగవిప్పిన త్రాచు గురించి కూడా మాటాడేసుకున్నాం. 

మాయింటి ముందుండే బోలెడంత జాగాని మాత్రం ఇళ్లతో నింపేశారు. అంచేత వేపా, పున్నాగలవీ మాయమయ్యాయి. ఏదైతేనేం, నా ఊహల్లో పదిలంగా ఉన్న ఆయిల్లు మాత్రం అలాగే కనబడేసరికి దుఃఖం తన్నుకొచ్చేసింది. అవే గుమ్మాలూ, అవే దూలాలూనూ!

భారమైన హృదయంతో బయటపడి మా చిన్నతనాలప్పటి పిక్నిక్ స్పాట్ బొజ్జన్నకొండకు వెళ్లాం. అప్పుడంతా మట్టిరోడ్డుమీద, రాయీరప్పా దాటుకుంటూ నానా యాతనా పడేవాళ్లం అక్కడికి చేరడానికి. పదిహేనేళ్లక్రితం ఆర్కియలాజికల్ సర్వేవారి దృష్టిపడి కాస్తంత అభివృద్ధి చెందింది. రాతిమెట్లదారి. వందలకొద్దీ శిలల్ని స్థూపాలుగాను, శివలింగాకృతుల్లోను మలిచారు. ఎన్నో వేల సంవత్సరాల చరిత్రకలిగిన ఈ కొండను మరింత అభివృద్ది మాత్రం చెయ్యాల్సివుంది.

తరవాత సర్వకామదాంబ పార్కు సమీపంలోని ఇంటికెళ్లాం. అందులో ఒక లాయరుగారున్నారు. వెనకాలంతా పెనుమార్పులు చెయ్యడంవల్ల నాకెటువంటి ఉత్సుకతా కలగలేదు. పార్కు కూడా పూర్వ వైభవం కోల్పోయి బోసిగా కనబడింది. అయినా నా పిచ్చగానీ, ఇప్పుడెవరుటా పార్కుకొచ్చి పత్రికలు చదివీ, ప్రాంతీయవార్తలు వినేది? 

సరే, ఇక అసలైనదీ, ఆత్మీయమైనదీ నా సాహితీపయనానికి బాటలు పరిచినదీ అయిన శారదా లైబ్రరీకి బయల్దేరాం. అయితే మాకొక సందేహం కలిగింది... అసలిప్పుడు ఆ లైబ్రరీ ఉందాలేదా అని!

వెంటనే మన మిత్రులు, విజయవాడలో వైద్యులు, అనకాపల్లి వారే అయిన శ్రీ గ్రంధి వెంకటరమణమూర్తిగారికి ఫోన్ చేసి అడిగాను. అదృష్టవశాత్తూ గ్రంథాలయ నిర్వాహకులు ఆయన సోదరులేనని, తప్పకుండా వెళ్లి కలవమని చెప్పారు. ఆరకంగా హైస్కూలు గ్రౌండు పక్కనున్న సందులోకి కారుని తిప్పి ఎదురుగా చూస్తే ఇంకేముందీ, గుమ్మంలో తెల్లటి సఫారీలో ఆరడుగుల ఎత్తున్న నిండైన మూర్తి శ్రీ కోరుకొండ బుచ్చిరాజుగారు మాకోసం ఎదురుచూస్తూ కనబడ్డారు.

అవే మెట్లు, అదే బోర్డు. మళ్లీ చిన్నపిల్లాణ్ణయిపోయాను. లోపలికడుగు పెట్టగానే ఆత్మీయంగా ఆహ్వానించారు. నా చందమామల అద్దాల బీరువాలన్నీ ఖాళీగా కనబడ్డాయి. భవనం మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉంది. అప్పటినుండి ఇప్పటివరకూ నిత్యం పూలమాలతో అలంకరించే బోసినవ్వుల గాంధీతాత బొమ్మ హాలు మధ్యలో దర్శనమిచ్చింది. వెనకాల వర్తకసంఘం వ్యవస్థాపకులు, స్కూలు, కాలేజీ, లైబ్రరీ, సంగీతకళా పరిషత్ మొదలైన ఎన్నో సామాజిక సంస్థల రూపకర్తా అయిన కోరుకొండ లింగమూర్తిగారి చిత్రపటం ఉన్నాయి.

ఎంతో శ్రద్ధగా మొత్తం అన్ని గదులూ తిప్పి చూపించారు. చిన్నపిల్లాణ్ణని లోపలికి రానివ్వని గదుల్లోకి సైతం ఇప్పుడొక హోదాలో ప్రవేశించి అక్కడున్న అపారమైన పుస్తకసంపదను కళ్లారా చూసి చేతులారా తడిమి ఆనందించాను. ఏడాదికొక బౌండు చొప్పున భారతి సంచికలన్నిటినీ లక్షణంగా భద్రపరిచారు. ఇక పద్దెనిమిదివందల తొంభైనాటి పుస్తకాల్ని సైతం చూసి నోళ్లు వెళ్లబెట్టాం. 

రచన పత్రికలు, రవీంద్రుని సాహిత్యం, భరాగో నూటపదహార్లు, మరో నూటపదహార్లు, వందేళ్ల తెలుగుకథ... ఇలా ఒకటీరెండూ కాదు మహప్రభో వేలకొద్దీ  పుస్తకాలు. 

ఇప్పుడెలా నడుస్తోందని ప్రశ్నించాను. ఆ భవనం కట్టింది పంతొమ్మిదివందల ముప్పైలోట. దాదాపు శతాబ్ది వయసున్నట్టే అనిపించలేదు నాకైతే! ఎంతో బలంగా, మరొక శతాబ్దమైనా చూసేటంతటి ధీశాలిలా నిలబడుంది. కానీ ఇంజనీరింగ్ నిపుణుల సలహామేరకు ఆ భవంతిని పడగొట్టి అదేచోట మరొక నిర్మాణం చేపట్టే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. నిధులకొరత ఏమీలేదని, ఎందరో దాతలు తమ ఉదారభావంతో బోలెడంత డబ్బు పంపుతుంటారని కూడా చెప్పారు. కాలానుగుణంగా సంభవించిన ఎన్నో మార్పులు అక్కడా చోటుచేసుకున్నాయి. కేవలం గ్రంథాలయాలనే నమ్ముకుని పోటీపరీక్షలకు తయారయ్యే విద్యార్థులు ఇప్పుడంతలా ఎక్కడుంటారు? అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు, వాటిలో కావలసినంత సమాచారం పుష్కలంగా లభిస్తోంటే ఇటువంటి పురాతన లైబ్రరీల మెట్లు నాలాంటి నోస్టాల్జియాగాళ్ల పాదాల చప్పుళ్లకై ఎదురుచూస్తున్నాయి. పుస్తకాన్ని రెండుచేతుల్లోకీ తీసుకుని దుమ్ముదులిపి వాటి సహజ సౌందర్యాన్ని తిలకించమంటూ కోరుకుంటున్నాయి. 

కాసేపు అక్కడున్న విలువైన పుస్తకాలన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించిన పిమ్మట వారి ఆత్మీయమైన సత్కారానికి కృతజ్ఞతగా నమస్కరించి సెలవుతీసుకుని ఇంటిదారిపట్టాం.

గతంలోకి ప్రయాణం ఎప్పుడూ బావుంటుంది. అయితే అప్పటి జ్ఞాపకాలన్నీ దాదాపు అలాగే ఎదురొచ్చి పలకరిస్తే మరింత మధురంగా ఉంటుంది. అదే భావన నా మనసంతా!


.......కొచ్చెర్లకోట జగదీశ్







 

0 comments:

Post a Comment

Featured Post

అందాల నెలరాజు

నెలనెలా... చంద్రుణ్ణోసారి పలకరించడం.. చల్లదనానికి  పులకరించడం.. అంబరాన సంబరాలు చేసుకునే అందాల నెలరాజుకి నాదైన భావావేశంతో జత బట్...

Search

Popular Posts

Archive