మేఘాలన్నీ నీ రంగు పులుముకున్నాయి. దారిపొడవునా చెట్లన్నీ పూలను నింపుకుని పులకింతల్లో తేలుతున్నాయి. ఆనందంతో ఊగిన ప్రతిసారీ జలజలా పూలు రాలుస్తున్నాయి. తారురోడ్డంతా జలతారులా మెత్తగా... బ్రతుకు పూలబాట కాదన్నాడు కవి. మరి ఇదేవిఁటోయి రామా?
అల్లంతదూరాన ఆలయశిఖరం బడినుంచి వచ్చే పిల్లాడికోసం ఎదురుచూసే అమ్మలా కనబడుతోంది. ఆత్రంగా ముఖద్వారాన్ని చేరాం. పండుముదుసలి రావిచెట్టొకటి ఒక కొమ్మతో ఆకుల్ని పైకెత్తుకుని ‘ఎవరదీ?’ అంటూ పలకరించింది.... అచ్చం ఇంటి అరుగున కూలబడి ఉండే అవ్వలా! ఒళ్లంతా పసుపు, మెడలో బోలెడన్ని ఆభరణాలు. పిల్లలు పుట్టాలనో, పుట్టిన వెధవలకి బుద్ధిరావాలనో... ఏవేవో మొక్కుతూ ఊరందరూ వేలాడేసిన దారాలన్నీ కంఠాన ధరించిందా రావిచెట్టు మామ్మ.
ప్రేమగా పలకరించి ఆప్యాయంగా ఆకుల్ని తాకి పాదరక్షల్ని కాసేపలా కాపలా కాయమని తనకే అప్పగించి లోపలికి అడుగుపెట్టాం. చల్లటిరాళ్లు పాదాలకు ప్రకృతి వైద్యం చేస్తున్నాయి. ప్రదక్షిణ చేస్తూ నీ నామాన్ని జపిస్తున్నాం. సహస్రనామ తత్తుల్యమైన నీ పేరు బహు సరళం, కడు మధురం కూడా.
మేఘాలతోను, మెరుపులతోను ఊసులాడుతున్న ధ్వజస్తంభం చంద్రుడి రాకకోసం ఎదురుచూస్తోంది. ముందున్న గుడిలో మూడడుగుల ముచ్చటైన కోతి ఆవునేతి అప్పాల్ని ఆరగిస్తూ నూనె వెలుగులో మాకు దొరికిపోయింది. మనస్కరించిన పిమ్మట స్వామి దర్శనం కావాలంటూ అనుమతి కోరి లోపలికడుగేశాం.
రాతిని నాతిగ చేసిన నీకు రాతితో గుడేవిఁటని? ఏ రాయిని ఎవ్విధాన దయతలచేవోనన్న ఆలోచనే నాకు. ప్రధాన మంటపం దాటగానే ఏడడుగులుగా నిండిన నిండైన మూర్తులు. నీవూ, మా తల్లి సీతమ్మా, ఆ పక్కనే నెమ్మదిగా తమ్మయ్యా!
ఎంత చల్లని చూపులవి! కరుణాంతరంగుడివి. శబరిని చూసినట్లే చూస్తున్నావు నావైపు. ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం అన్నందుకు అచ్చం అలానే చేశాడు ఆ శిల్పి ఎవరో? ఎదురుగా రాముడొచ్చి నిలబడినప్పటి రామదాసులా ఉంది నా మనస్థితి!
‘అయ్యా, తమరి గోత్రనామాలు చెబుతారా?' అయ్యోరి పలకరింతకు పులకరింతనుంచి బయటపడ్డాను.
‘....కాశ్యపస గోత్రం, అనంత వెంకట సూర్య....’
వేయినామాలవాడి ముందు నా పేర్లన్నీ ఏకరువు పెడుతోంటే నవ్వొచ్చింది. ఎంతకూ చూపు మరల్చనివ్వని రూపురేఖలతో మీ ముగ్గురూ గర్భగుడికి శోభనిస్తున్నారు. ఇత్తడి కుందుల్లో ధగధగలాడుతున్న దీపాలు నీ పాదాల్ని తాకాలని మునుముందుకు దూకుతున్నాయి.
‘సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువమ్...’ నీ ఎదపైకి విసిరిన పూలన్నీ పాదాలపైబడి పరవశిస్తున్నాయి. సీతమ్మ చెవి లోలాకు చూడాలన్న నా కోరిక తీరనేలేదు. ముచ్చటైన నీ రూపమే మనసంతా నిండిపోయింది.
కొండంత దేవుడికి ఉండంత కర్పూరాన్ని మండించి వెలుగురేఖల్లో వేలుపుని చూపిస్తున్నారు.
‘....నారాయణ పరోజ్యోతిరాత్మా నారాయణః పరః...’
ఘంటానాదం, నైవేద్యం, తీర్థం అంటూ కావలసినంత జాప్యం జరుగుతోంది. ఎంతసేపైనా విడిచి వెళ్లాలన్న ధ్యాసే లేదు మాకు.
అరచేతిలో గుప్పెడు శనగలు పోస్తుండగా పలకరించాను బ్రహ్మగారిని....
‘ఏవూరు స్వామీ మీది?'
ఏవూరైతేనేం? రాముడి సేవకై నియమితమైనవాడు. సుంకరమెట్టవాడైతే సుగ్రీవుడూ, విజయవాడనుంచైతే విభీషణుడూనూ!
చుట్టుముట్టిన నాగరికథల్లో కాస్తంత జాగా నీకోసం వదిలారంటే అదంతా నీ భక్తి సామ్రాజ్యమే! అల్లంతదూరాన జగదాంబా జంక్షన్ కనబడుతోంది. అంగుళానికొక అరలక్షగా ఆవరించేసుకున్న ఆక్రమణాసురుల అక్రమాల నడుమ నీకంటూ ఇంత చోటిచ్చిన ఆ భక్తవరేణ్యులెవరో వారికి పాదాభివందనం!
జగమే రామమయం!
0 comments:
Post a Comment