గోదారితల్లి నీళ్ళదయవల్ల రాదారి మొత్తం పచ్చని పంటపొలాలతో, సైనికుల్లా స్వాగతం పలుకుతున్న కొబ్బరిచెట్లతో తూర్పుగోదావరి జిల్లా మాకు ఆతిథ్యమిచ్చింది. ఆరోజు పొద్దున్న వెళ్ళాలా వద్దా అన్న మీమాంసనుండి బయటపడి, కాసేపు గొడవపడి మొత్తానికి బండిలో వచ్చిపడ్డాం.
పుణ్యం,పాపం మాట పక్కనబెడితే....
పదిమందికి అన్నంపెట్టి'నది',
నిరంతర ప్రవాహంతో, నిర్మలహృదయంతో విలసిల్లి'నది',
కవులకూ, కావ్యాలకూ ఆలవాలమై'నది',
రోజూచూసే వెన్నెల్నే వెండిపళ్ళెంలా చూపించి'నది',
పాపికొండల గుండెలపై పైటగా నిలిచి'నది', బాపూరమణల్ని కలిపి'నది'.......
అయిన గోదావరికి మనసున్న ప్రతిమనిషీ ఋణపడివుంటాడు.
ఏడాదికోసారి తద్దినాలుపెట్టే జాతినుంచి పండగల్లో పెద్దలకి పెట్టేవారిదాకా అందరూ ఏదోరూపాన ఋణం తీర్చుకునేవాళ్ళే! ఆమాటకొస్తే ఇదంతా 'నాన్సెన్సు' అంటూ సేతువుల్ని పడగొట్టే హేతువాదులుకూడా జయంతులూ, వర్ధంతులూ వెలిగిస్తూనే వుంటారు.
మరలాంటప్పుడు 'పన్నెండేళ్ళకోసారి ఆతల్లికి దణ్ణంపెట్టుకొస్తే తప్పేంటి?' ........ఇదుగో ఈభావమే నన్ను కదిపింది. నన్నేకాదు....దేశాన్నే కుదిపింది.
నది ప్రయాణం చేసి సముద్రంలో కలుస్తుంది. ఇవాళ జనసముద్రమే నదిలో కలిసింది. ఏ'కంచె'లూ ఆపలేకపోయాయి.
ఈకోలీకి భయపళ్ళేదు. ఆకలికి తడుముకోలేదు. రేవు దగ్గర్నించి బస్టాండుదాకా అందరూ డొక్కా సీతమ్మలే! కాశీ అన్నపూర్ణలే! తిన్నవారికి తిన్నన్ని అన్నప్రసాదాలు! రుచులుమార్చి పులిహోరలు, దద్ధోజనాలు, చక్కెరపొంగళ్ళు.
ఒకటేమిటి! నీళ్ళడిగితే మజ్జిగిస్తున్నారు. రాయలకాలంలో వున్నామా రాయమండ్రిలో వున్నామా అన్న డౌటొచ్చింది సుమండీ!
ముష్కరులు దాడిచేస్తే లష్కరేతొయిబాని, సునందా పుష్కర్ చనిపోతే శశిథరూర్నీ అనుమానిస్తారు. అందులో వింతేమీలేదు. కానీ ఈతోపులాటేమిటి? జనం తోసుకుని అకాలమరణం పాలయ్యారు. అత్యంత విషాదకరమైన సంఘటన!
ఆతరవాత మొదలైంది అసలు తోపులాట ... చంద్రబాబునీ, చాగంటాయన్నీ మధ్యలో నిలబెట్టి తోసుకోడం మొదలెట్టారు.
అప్పుడే పుట్టిన పసిపిల్లాడికి పాలుతాగమని చెప్పక్కర్లా! తల్లి రొమ్ము తగలగానే తల్లడిల్లిపోతాడు. పుష్కరాలకి రమ్మని ఒహళు చెప్పేదేఁవిటి? నువ్వు లైట్లుపెట్టినా పెట్టకపోయినా, బస్సులేసినా వెయ్యకపోయినా, పుణ్యమని వూరించినా, పాపమని వారించినా, బురదగావున్నాయన్నా, దురదలొస్తాయన్నా వచ్చేవాడు రాకమానడు.
పన్నెండురోజుల పండగలో పుణ్యాన్ని మూటకట్టుకున్న సామాన్యులు , పాపాన్ని కడిగేసుకున్న అసామాన్యులు, ఆతల్లి పాదాలచెంత అసువులుబాసిన అభాగ్యులు. వీరందరి మధ్యా బాగా ప్రజాబాహుళ్యానికి గురైన పదాలు.....సీబీఎన్ను, ఏబీఎన్ను; చాగంటీ, గరికపాటి.
ఏదేమైనా ఈపుష్కరాలుమాత్రం వాటికవే సాటి.
..........జగదీష్ కొచ్చెర్లకోట
0 comments:
Post a Comment