పువ్వెందుకు తీగపై పుడుతుంది?
గుడిలోనో, జడలోనో నిలవాలని...
ముత్యమేల కడలిలో పుడుతుంది?
ముచ్చటైన హారంలో మెరవాలని...
ఈ పువ్వు ఎనభయ్యారేళ్ళకు పూర్వం సింగిరెడ్డివారింటి తోటలో పూసింది. ఆయింటికే కొత్తవెలుగు వచ్చినరోజది!
కాలక్రమంలో మూడుపదుల వయసులో సినీసంగీతాంబుధిలో సరికొత్త ముత్యమై మెరిసింది.
కలల రాకుమారిని వర్ణించే ఒకపాటతో 'కల'కలం సృష్టించింది. అందరి మనసులనూ దోచుకున్న ఆపాటతో చిత్రజగతికి ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఎదురైనట్టనిపించింది.
నిన్నలేని అందమేదో నిదురలేచిందనీ అనిపించింది.
సంగీత సాహిత్య సమలంకృతమైన ఆ గీతామృతధారలో పగలే వెన్నెల కురిసినట్టనిపించింది.
అది మొదలు సందర్భమేదైనా నారాయణుడి విశ్వరూపం ప్రతి రచనలోనూ ద్యోతకమవుతూ వచ్చింది.
జీవన వైరుధ్యాన్ని జీవనదిలాంటి తెలుగుభాషలో జవజీవాలతో మన ముందుంచిన రెడ్డిగారి ప్రతిభా'పాట'వానికి తార్కాణాలు ఎన్నని ఎన్నగలమని?
పాశ్చాత్య ధోరణులను నిలదీస్తూ మనదేశ సంస్కృతిని తెలియజెప్పే పాటరాసిన చేత్తోనే నందామయా గురుడ నందామయా అంటూ ఆనందసారాన్ని బోధించాడు.
రేపల్లెమేలుకున్న దృశ్యాన్ని కనులముందు సాక్షాత్కరింపజేసే అక్షరరమ్యతకు మన మనసంతా ఆహ్లాదకరంగా మారిపోతుంది.
'ముంగిళ్ళలో ముగ్గులుపెడుతున్నారు చిట్టితల్లులు
కడవలు పట్టుకుని యమునకు పోతున్నారు కన్నతల్లులు
ఆలమందలో వున్నారు అయ్యలు
చేలగట్టున పోతున్నారు అన్నలు
నట్టింట్లో ఎవరూలేరు..ఉట్టిమీద వెన్నతప్ప..
పిల్లి అడుగులూ వేస్తూ రావయ్యా! వెన్నమీగడలు కాజేసి పోవయ్యా!'
ఇదెక్కడి ఆహ్వానం సామీ? రోజంతా రెక్కలు ముక్కలయ్యేలా చిలికిపెట్టుకున్న వెన్నమీగళ్ళని దొంగిలించుకు పొమ్మనడం?
అదే ఆ కలంలో గమ్మత్తు! మూతినిండా అంటుకున్న వెన్నతో మురిపాల కృష్ణుడి ముద్దురూపం చూడాలన్న కోరిక అది!
బాపు 'స్నేహం'కోసం రాయించుకున్న ఈపాటలో వైవిధ్యాన్ని గమనించండి.
కళ్ళులేని మిత్రుడికి చూపుల వెలుగుని ప్రసాదిస్తానని అనగానే ఆ పసిహృదయం పలికిన పలుకుల్ని వినండి...
'నాముందుగ నువ్వుంటే తొలిపొద్దు
నువు చెంతగ లేకుంటే చీకటి
చేయితాకితే తీయని వెన్నెల
అలికిడి వింటేనె తొలకరిజల్లు....'
కాలమానాన్ని కొలిచే కొలమానం తన మిత్రుడేనట! కాలనికి నిలిచే ఇటువంటి పాటల విలువను కొలిచే సాధనం మాత్రం మన దగ్గరలేదు.
'కృతిని అమ్మని పోతన్నకు
మెతుకే కరువైపోలేదా?' అనంటాడు...
'పాడేకోకిల మూగవోతే పలకరించేదెవరు?' అనీ అంటాడు...
ఆనోటితోనే....
'ఏఫలమాశించి మత్తకోకిల
ఎలుగెత్తి పాడునూ? ఏసిరికోరి పోతన్న భాగవతసుధలు చిలికెనూ?' అంటాడు...
న్యాయస్థానంలో ఇరుపక్షాలకీ ఒకడే లాయరుంటాడా? కానీ ఇటువంటి సమన్యాయమైన పాటలతో సమన్వయం కుదిర్చేది మాత్రం కవులే!
ఈయన రచనావైచిత్రిని గమనిస్తే చిత్రం భళారే విచిత్రమని అనకతప్పదు.
'ప్రియురాల సిగ్గేలనే?' అంటూ వశంచేసుకోవాలన్నా
అలకలు తీరిన కన్నులు పలికే భాష తెలపాలన్నా
ఈకలానికి అలవోకయే!
పగటిపూట చంద్రబింబాన్ని చూపించే చమత్కృతి,
నెలవంక తొంగిచూసిందంటూ నెచ్చెలిని చేరే రసధృతి...ఈయనకు చిటికెలో పని!
మల్లెకన్నా తెల్లని మనసులంటాడు...
మధువొలకబోసే చిలిపికళ్ళంటాడు...
మాటలకందని భావాల్ని పలికించే వీరి గీతాలు
మధురభావాల సుమమాలలు!
వటపత్ర శాయికి వరహాల లాలిపాట,
దేవుళ్ళందరూ నిదరోయారురా...
కోడెపిల్లడా నీకెందుకు నిదుర రాదంటూ మరొకపాట
'నీమది చల్లగా...స్వామీ నిదురపో!' అంటూ జీవనపోరాటంలో అలసిన భాగస్వామిని సేదతీర్చే ఈపాటను విని నిద్రకళ్ళు పడనివారుంటారా?
మారాలీ మారాలీ అంటూ మనుషుల నడవడిని ప్రశ్నిస్తాడు.
మంచిని సమాధి చేస్తారా అంటూ నిలదీస్తాడు.
గాలికి కులమేదంటూ ఆలోచింపజేస్తాడు
అనుబంధం, ఆత్మీయత ఒక బూటకమని తేల్చేస్తాడు
సూర్యకిరణాలకి మల్లే పలుదిక్కుల ప్రసరించిన వీరి కలంనుంచి భగీరథుడి గంగావతరణ దృశ్యమూ అవతరించింది.
'ఏమి వెన్నెలోగానీ ఎంతకూ మన ఇద్దరిపైనే పడుతున్నది...'
ఏమిటా భావం? ఎంత తాదాత్మ్యం? పరవశానికి కూడా ఒక హద్దుండాలా? అక్కర్లేదని నిరూపించాడాయన!
లేకపోతే కళ్ళతో పలికించిన ఇన్ని భావాల్ని కవి కన్నులతో పరికించండి....
'ఆకలేసిన కళ్ళు
ఆవులించిన కళ్ళు
రైక తొడిగిన కళ్ళు
పైట తొలగిన కళ్ళు'
నీకళ్ళు చేపల్లా వున్నాయనీ, పారిపోయే లేడికళ్ళనీ, కలువరేకులనీ, అనీఅనీ, వినీవినీ వున్న మనకి...
'ఏటిపాయలో చేపకళ్ళు...తోటమలుపులో లేడికళ్ళు...'
అనగానే సోషొచ్చి పడిపోతోంటే సోడా తాగించినట్టుండదూ??
ఇక ఈయనగారి రసావిష్కృతిని గమనిద్దాం....
ఎటుచూసినా అందమే కనబడితే...
ఏవేళనైనా 'ఒకే'కోరిక!....ఏఁవంటారు?
ఎంతటి రసికుడికైనా కైపున్న మచ్చకంటి చూపు పచ్చల పిడిబాకులా గుచ్చుకుంటే తెలుస్తుంది ఆ పడుచుదనపు గిలిగింత!
కబురులతోనే సరిపోయిందా
కవితలల్లితే అయిపోయిందా
కన్నియ మనసే కనుగొన్నావా
అంటూ అమ్మాయి కవ్విస్తే...
నీతీయని పెదవులు అందకపోతే
నిదరే రాదమ్మా.. అంటూ అబ్బాయి నవ్వించడూ?
పూతరేకుల తియ్యదనం నీ లేతసొగసేనంటాడు
పాలమీగడ కమ్మదనం నీ పడుచుదనమంటాడు
నడకలు చూస్తే మనసవుతుందంటూనే
కనులముందు నీవుంటే కవిత పొంగిపారుతుందంటాడు...!
ఈప్రవాహానికి అంతులేదు. గోదారి లంకల్ని వర్ణించినట్టుంటుంది ఈనగారి పాటల్ని పరికించడమంటే!
ప్రపంచపదుల్నీ, విశ్వంభర కృతుల్నీ సృష్టించిన సినారె కర్పూర వసంతరాయని ప్రేమకావ్యాన్నీ ఆవిష్కరించాడు.
గుండెనే పలికించితే కోటిపాటలు పలుకుతాయ్
మమతనే పండించితే మణులపంటలు దొరుకుతాయ్...ఎంత ఉదాత్తమైన సారాంశం!
నాగుండెను పలికించితే సినారె పాటలు సితారలై మోగుతున్నాయి.
ఇతడిపైన మమతను పండించుకుంటే కురిసేవెన్నెల్లో మెరిసే గోదారిలా కనబడుతోంది!
ఇతగాడి పాటలతోటలో విహరించిన మన మనసులకి ఒకటే కోరిక...
'ఆరాజు ఈరోజు అరుదెంచునా?' అని!
తిరిగిరాని లోకాలకు పయనమైపోయిన ఈ పద్మభూషణుడి పేరు తలచినా చాలు..
మదిలోపొంగు శతకోటి యమునాతరంగాలు!
అదిగో....ఇంద్రుడు శచీసమేతుడై తరలి వస్తున్నాడు...
దేవతలంతా స్వాగతం...సుస్వాగతమని పాడుతున్నారు...
సప్తర్షులు జయీభవా దిగ్విజయీభవా అని దీవిస్తున్నారు...
అశ్వనీదేవతలు ముత్యాల జల్లు కురిపిస్తున్నారు...
మానవజాతి మనుగడకే మచ్చలేని మహరాజువి నీవని బృహస్పతి కీర్తిస్తున్నాడు...
నీ దర్శనభాగ్యం లభించిన నర్తకీమణులు పూజకు వేళాయెరా అంటూ పూలతో ఎదురొచ్చారు...
నీవు రాగాలసిగలోన సిరిమల్లెవి
సినీ సంగీత గగనంలో జాబిల్లివి...
అందుకే...
చందురుడే నిన్నుచూసి చేతులెత్తాడు..
ఏపారిజాతమ్ములీయగలను స్వామీ?
ఈ పదాల మాలికలనే వసంతాలుగా దోసిట దూసి నీ ముంగిట చల్లడంతప్ప??
తారలెంతగా మెరిసినా చుక్కల్లో పెదచుక్కవి నీవు..
నీకిదే అభినందన మందారమాల!!
మళ్ళీ మాగడ్డపైనే జన్మించు...
మా జాతికి పట్టిన గ్రహణాన్ని విడిపించు!
నీవు దిగివెళ్ళిపోయిన ఆ జ్ఞానపీఠం మీద తిరిగి నువ్వే కూర్చోవాలని మా ఆకాంక్ష!
నివాళులు!
........జగదీష్ కొచ్చెర్లకోట
0 comments:
Post a Comment