తెల్లారిపోయింది పల్లె లేచిందీ...
రేడియోలో బాలు గొంతు వినబడగానే కళ్ళు నులుముకుంటూ లేచేవాళ్లం. నాన్నగారికి పెందరాళే లేచే అలవాటు. అప్పటికే కాలకృత్యాలన్నీ కానిచ్చేసి, అమ్మకి సాయం చేస్తూండేవారు. అటువంటి మగవాళ్లని నా ఇన్నాళ్ల జీవితంలో ఎక్కడా చూడలేదు. అంటే ఆయనేమీ మహాపురుషుడు, మహానుభావుడని కాదు.
ఒక్క క్షణం కూడా ఖాళీగా కూర్చునేవారు కాదసలు. రేడియోలో భక్తిరంజని, వార్తలు, పుష్పాంజలి వస్తూనే ఉండేవి. దొండకాయలో, బీరకాయలో చక్కగా ముక్కలు తరిగి ఇచ్చేసేవారు. పనసపొట్టయితే ఒక చిన్న ఆపరేషన్ చేసినట్టు ముందుగా సరంజామా ముందేసుకుని కూర్చునేవారు.
చిన్న కాగితం పొట్లంలో కాస్త పసుపు, గిన్నెతో నూనె, మంచి కత్తి, ఒక గోనెపట్టా తెచ్చుకునేవారు. లుంగీని తొడలదాకా లాక్కుని, బనీనుతో కూర్చుని లయబద్ధంగా కొడుతోంటే అలా విస్మయంగా చూస్తూ ఉండేవాళ్లం. గునపాన్ని తిరగేసి పాతి, కొబ్బరిబొండాలు వలిచేవారు. చేదతో నీళ్లు తోడి పిల్లలందరికీ స్నానాలు చేయించేవారు. ‘చలేస్తోంది నాన్నగారూ!’ అంటే ’నూతిలో అగ్గిపెట్టె వేశాను, వేడిబొబ్బలు వస్తాయి’ అంటూ పోసేసేవారు. మనం తేరుకునేలోగా స్నానం అయిపోయేది.
కొన్నాళ్ల తరవాత పొట్టుపొయ్యి మీద కాగుబిందెతో నీళ్లు కాచి పోసేవారు. విశాలాక్షినగర్లో ఉన్నన్నాళ్లూ ఇటుకల పొయ్యి మీద కొబ్బరిమట్టలన్నీ మండిస్తూ నీళ్లు కాచేవారు.
అప్పడాలు వత్తడం, వడియాలకి బూడిద గుమ్మడికాయ తరగడం, ఆవకాయలు కలపడం.. ఒకటేమిటి? అన్ని పనులూ చేసేవారు. పడక్కుర్చీలో విలాసంగా కూర్చుని అరగంటకోసారి ‘లక్ష్మీ, కాఫీ పట్రా!’ అనే భర్త కారాయన. కావాలంటే తనే వెళ్లి కలిపేసుకుని, అమ్మకీ ఓ గ్లాసు ఇచ్చేరకం. తను కనబడకపోతే ‘బచ్చోంకీ మా! ఎక్కడున్నావోయ్, కాఫీ ఇదిగో!’ అంటూ వెంటపడి మరీ ఇచ్చేవారు.
అలాగని ఆయనకేమీ పనీపాటా లేదనుకునేరు. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు. ఉద్యోగరీత్యా అనేక ప్రదేశాలు బదిలీలయ్యేవి. అన్నీ విశాఖపట్నం జిల్లాలోనే. అనకాపల్లిలో కాపరంపెట్టి, విశాఖపట్నం రోజూ ఉదయం పూట రైలుకి వెళ్లేవారు. గోదావరి ఎక్స్ప్రెస్ లేటయితే కాస్త ఊరటగా ఉండేది. నింపాదిగా తెమిలేవారు. కరెక్ట్ టైమయితే మాత్రం పరుగులే! వేడివేడన్నం కుక్కేసుకుని, బయల్దేరిపోయేవారు.
మావీధి చివర సత్యనారాయణ గారని ఒకాయన ఉండేవారు. వాళ్లింట్లో ఫోనుండేది. ఆయన ఉదయాన్నే స్టేషనుకి ఫోన్ చేసి రైలేమన్నా ఆలస్యముందేమో భోగట్టా చేసేవారు. మా పిల్లల్లో ఎవరో ఒకరం ఆయనింటికెళ్లి లేటు కనుక్కుని వచ్చేవాళ్లం. దురదృష్టవశాత్తు ఆయన పేరు ‘లేటు సత్యనారాయణ గారు’గా స్థిరంచేసేశాం. కొక్కిరాయి వేషాలు చిన్నప్పటి నుంచీ!
ఈయన వైజాగ్ స్టేషన్లో దిగి, ఇంకొంతమందితో కలిసి అలా చావులమదుం మీదుగా అల్లిపురం, అక్కణ్ణుంచి దండుబజార్ రోడ్డమ్మట కలెక్టరాఫీసుకి నడిచి వెళిపోయేవారు. ఇప్పుడు మనం అంతంత దూరాలు నడవడం అనేది కల. ఆయన కష్టజీవి. ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండేవారు.
చదువు పట్ల ఆసక్తి ఉండేదికాదు. మమ్మల్ని కూడా ఏదో అలా చదివించేసి, ఏవో ఉద్యోగాలు చేసుకుంటే చాలన్నట్లే భావించేవారు. కానీ అప్పటికే ఎమ్సెట్లవీ వచ్చేసి, కుర్రాళ్లందరికీ ఆసక్తి, అనురక్తి పెరిగిపోవడంతో మా అన్నయ్య పట్టుబట్టి నన్ను డాక్టర్ చదివించమని బలవంతపెట్టాడు. ఆయన భయపడ్డారు. అయినా వినలేదు. ఇంతాజేసి మెడికల్ కాలేజీలో ఫీజులు రెండువందలయాభై రూపాయలో ఎంతో ఉండేవి.
చేరిన కొత్తలో డిసెక్షన్ కిట్, ఏప్రాన్ కొనుక్కున్నాను. గ్రేస్ అనాటమీ మాత్రం చాలాకాలం కొనలేదు. అది చాలా పెద్ద పుస్తకం. ఏకంగా నాలుగువేల పేజీలు. సెకండ్ హేండ్ బుక్ షాపులన్నీ బ్యారెక్స్ దగ్గర వరసగా ఉండేవి. సరికొత్త ఎడిషన్ ముప్ఫయ్యారోది అయితే నేను ముప్ఫైనాలుగో ఎడిషన్ కొనుక్కున్నాను. అనాటమీ డిసెక్షన్ మాన్యువల్స్ కూడా పాతవి తెచ్చుకున్నాను. ఒక్క ఫిజియాలజీ గైటన్ మాత్రమే కొత్తది కొన్నాను.
ఫస్టియర్లో తొమ్మిది నెలలపాటు హాస్టల్లో ఉన్నాను. కానీ అక్కడ నీళ్లసదుపాయం ఉండకపోవడం వల్ల ప్రతివారం అనకాపల్లి వచ్చేసేవాణ్ణి. నా తిప్పలు గమనించి నాన్నగారు వైజాగ్ కాపరం మార్చారు. మొదట్లో అక్కయ్యపాలెం లలిత గుడి వీధిలో ఇల్లు తీసుకున్నాం. అక్కడికి ఫార్టీఎయిట్ మాత్రమే వచ్చేది. అది ఎక్కితే జగదాంబ జంక్షన్లో దిగి కెజిహెచ్ వరకూ అప్పంతా నడుచుకుంటూ వెళ్లేవాణ్ణి. బక్కగా, నలభైకేజీలో ఎంతో ఉండేవాణ్ణి. కాసేపుంటే పడిపోతానేమో అన్నట్టు కనబడేవాణ్ణి.
మొత్తానికి రకరకాల ఇళ్లవీ మారి చివరికి స్వగృహానికి చేరాం. కానీ అది ఊరిచివర ఇల్లు. అక్కణ్ణుంచి కూడా రెండు మూడు బస్సులు మారి కాలేజీకి వెళ్లేవాణ్ణి.
ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏరోజూ కూడా నాకు బాధనిపించలేదు. ఒక బండి ఉంటే బావుండుననీ అనిపించలేదు. అలా అనిపించకపోవడానికి కారణం మా నాన్నగారే! హౌస్సర్జన్సీలోకి వచ్చాక ఒక మోపెడ్ కొనుక్కున్నాను.
ఆయన ఏనాడూ ఇదే మన స్థాయి అని, ఇలాగే బతకాలిరా అనిగాని, నాకంత స్తోమత లేదనిగానీ చెప్పలేదు. సదుపాయమో, సౌకర్యమో లేకపోతే ఎలా బ్రతకాలో బ్రతికి చూపించారు.
అన్నిటికంటే పెద్ద సదుపాయం దేవుడిచ్చిన శరీరం. అంతకంటే సౌకర్యం ఆరోగ్యం.
ఇదే ఆయన సిద్ధాంతం.
అవకాశాలు, అవసరాలు విలోమనిష్పత్తిలో ఉంటాయని తెలిసిన వ్యక్తి ఆయన.
రిటైరయిన తరవాత మరింత బిజీ అయిపోయారాయన. విశాలాక్షినగర్లో ఒక రామాలయం నిర్మించాలని సంకల్పించి, ఆయనతోపాటు మరికొందరు కలిసి, విస్తృతంగా తిరిగి, చందాలవీ పోగుచేశారు. ఆనక ఒక చిన్న గుడిని కట్టించగలిగారు. సీతాలక్ష్మణ హనుమత్సమేత రామచంద్రుడు కొలువయ్యాడు. ప్రతియేడూ కళ్యాణోత్సవం, అన్నదానాలు, ధనుర్మాస పూజలు, ధార్మిక కార్యక్రమాలు విధిగా జరిపిస్తూ ఆ దేవుడికి ఏరోజూ వైభవానికి లోటు జరక్కుండా చూసుకున్నారు.
అమ్మ అనారోగ్యం కారణంగా కాలం చేసిన పిమ్మట ఆయన్ని ఎలాగైనా మాదగ్గరకి తీసుకురావాలని ప్రయత్నించాం. కానీ ఆయనకి వంట తెలుసు. ఆ కారణాన తనింట్లో హాయిగా ఒక్కరూ ఉండడానికే ఇష్టపడేవారు. ఎంతమంది చెప్పినా వినలేదాయన.
మతిభ్రమణం మొదలవుతోందని గ్రహించి, మెల్లిగా నచ్చచెప్పి ఆయన్ని తీసుకొచ్చి మాదగ్గర పెట్టుకున్నాం. ఆయనది అసాధారణమైన ఆరోగ్యస్థితి.
బీపీ ఎప్పుడూ నూటముప్ఫై దాటేది కాదు. ఎనభయ్యేళ్ల వయసులో కూడా రక్తపరీక్షలు చేస్తే రిపోర్టులన్నీ చూసి పెథాలజిస్టే ఆశ్చర్యపోయాడు. ఒక్కటంటే ఒక్కటికూడా బోల్డ్ లెటర్స్ లో లేదు. అన్నీ నార్మలే!
కానీ మతిమరుపుతో రెండుమూడేళ్లు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మా మొహాలవీ తెలుసుగానీ పేర్లు మర్చిపోయారు. వాళ్ల అన్నయ్య పేరు మాత్రం టక్కున చెప్పేవారు.
‘తనే నన్ను చదివించాడు చిన్నప్పుడు! అన్నయ్య పేరు జోగిరాజు!’ అనేవారు.
అదంతే! ఆ మనిషెళ్లి నాన్నగారి మెదడులో అట్టడుగు పొరల్లో స్థిరపడిపోయాడు. ఏ అల్జిమర్సూ, డిమెన్షియాలు సైతం చెదరగొట్టలేనంత గాఢత ఆ అన్నదమ్ముల మధ్య అనుబంధానికి!
కనీసం ఒక్కటంటే ఒక్కటైనా మాత్రనేది ఎరగరు. ఏడాదిన్నర క్రితం కాస్త విషమించడంతో ఐసియులో చేర్చాను. అదే ఆఖరనుకున్నాం. కానీ మళ్ళీ హుషారుగా ఇంటికొచ్చేశారు. మళ్ళీ నెలరోజుల్లో పార్కిన్సన్స్ వచ్చి ఎక్కడికక్కడ ఫిక్సిటీ వచ్చేసి శరీరమంతా బిర్రబిగుసుకుపోయింది.
ఆరు నెలలపాటు నేను మరొక మనిషి సాయంతో స్నానం, బెడ్ సోర్స్ డ్రెస్సింగ్ చేశాను.
ఇక ఆయనకి ఇడ్లీలు, పల్చగా అన్నం, మజ్జిగ, పళ్లరసాలు, ప్రొటీన్ పౌడర్లతో అరగంట చొప్పున మూడుపూటలా తను చేసిన స్పూన్ ఫీడింగ్ మాత్రం నా కళ్లను చెమర్చేలా చేసేది. బోల్డన్ని కబుర్లు చెప్తూ, నోరు తెరవకపోతే కోప్పడుతూ, త్వరత్వరగా తినేస్తే ‘గుడ్ బాయ్’ అంటూ మెచ్చుకుంటూ ఎంతో ఓర్పు, నేర్పుతో తినిపించేది. ఏ జన్మదో ఆ రుణం!
ఇదంతా మెప్పుకోసమో, గొప్పకోసమో చెప్పడంలేదు. నిత్యం హుషారుగా, ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటూ, జిహ్వచాపల్యం ఏకోశానా లేని నాన్నగారిని అలాచూసిన మాకు కడుపు తరుక్కుపోయేది. అందుకే మా బిజీ షెడ్యూల్స్, ప్రాక్టీసు, ఫేస్బుక్ రాతలు, పిల్లల చదువుల మధ్య కూడా నాన్నగారిని ఒక చంటాడిలా సాకాలని నిర్ణయించుకున్నాం.
ఆయన పాడుచేస్తే చాలాసార్లు కడిగాను. అప్పుడు నా బాల్యం గుర్తొచ్చింది. మన చిన్నతనాల్లో ఎన్నిసార్లు గుడ్డలవీ మార్చివుంటారో కదా? అంతే! అదే భావన మమ్మల్ని ముందుకు నడిపించింది.
అదృష్టవశాత్తూ నా కొడుకులిద్దరూ కూడా అసహ్యం అనేమాట ఎరగరు. కొన్ని చెప్పలేని ఇబ్బందికర పరిస్థితుల్లో సైతం నాకు వాళ్లు నిరభ్యంతరంగా చేసిన సాయం తప్పక చెప్పితీరాలి.
ఇవాళ నాన్నగారి పుట్టినరోజు. ఏడేళ్ల వయసులోనే తండ్రిని పోగొట్టుకుని తల్లి, అన్నయ్యల సహకారంతో పెరిగారు. తాతగారు పెద్ద స్టేజ్ ఆర్టిస్ట్ అవ్వడం వలన కుటుంబాన్ని ఎక్కువగా పట్టించుకోలేదని తెలిసింది. ఎప్పుడూ దేశాంతరాలే! ‘రంగూన్ రౌడీ’ అనబడే కొచ్చెర్లకోట రంగారావు. అన్ని వ్యసనాలతోపాటు అదీ ఒక వ్యసనమే! ఏమీ చెయ్యలేం.
నాన్నగారి ధర్మచింతన, పరోపకారం ఈరోజు మాకీ స్థాయిని తెచ్చిపెట్టాయని నిబ్బరంగా చెప్తాను. ఆయనొక స్ఫూర్తిదాయకుడన్న విషయం మాత్రం నిజం.
షష్టిపూర్తి, సహస్రచంద్ర దర్శనం అత్యంత వైభవంగా జరిపించాం. అదొక తృప్తి మాకు!
గతయేడాది డిసెంబర్ పదిహేనున నాన్నగారు మాకు దూరమయ్యారు. ఈ నెలాఖరున సంవత్సరికాలు జరుపుతున్నాం.
హృదయపూర్వక నివాళులు!
0 comments:
Post a Comment