‘వినాయకచవితికి కొత్తబట్టలు ఎవరూ కొనుక్కోరు. నెలతిరగ్గానే దసరా వస్తుందిగా? అప్పుడెలాగూ కుట్టించుకోవాలి. ఉన్నవాటిలో కాస్త మంచివి తీసి వేసుకోండి! చాలు’
ఇక చేసేదేంలేదు. అమ్మ మానిఫెస్టోలో లేనివి అడగడం అనవసరం. ముదురు రంగు నిక్కర్ల మీదకి ఏ చొక్కా వేసుకున్నా బానేవుంటుంది. నలుగుర్లోనూ కాస్త ఆనతారు పిల్లలు. ఇవన్నీ అనుభవం నేర్పిన పాఠాలు.
గళ్ళ బుష్కోట్లకీ, చారల చొక్కాలకీ కావలసిన తాను నాన్నగారు ఆప్కోలో కొనేవారు. గుడ్డ కాస్త మందంగా ఉండటాన బాగా మన్నేవి. అదే సమస్య. చిరిగిపోతేనే కదా కొత్తవొస్తాయి!
గూడెం నుంచి తెచ్చుకున్న నల్లరాయితో రాత్రే కొట్టి ఉంచుకున్న కుంకుడుకాయల్లో అరచెంబుడు వేణ్ణీళ్ళు పోస్తే పులుసు తయారైపోయేది. గింజలన్నీ ఏరేసి బాగా రసం పిండి అందరికీ తలలంటే పని నాన్నగారిది. ఆడపిల్లలకి అమ్మ పోసేది.
మొత్తానికి నేరేడుపండు రంగో, నలుపో లేక తోపురంగుదో నిక్కర్లోకి కనకాంబరం రంగు గళ్ళ చొక్కాలు దోపేసుకుని పక్క పాపిళ్లతో మగపిల్లలు, పెద్దపెద్ద పువ్వులున్న లేతాకుపచ్చ గౌన్లతో ఆడపిల్లలు వెరసి అయిదుగురం తయారై బయటికొచ్చేవాళ్లం.
పిల్లలందరం ముందురోజు సాయంత్రం రిపబ్లిక్ పార్కులో చెట్లన్నీ దులిపి దులిపి ఏరుకొచ్చిన పత్రి మొత్తం ఓ పెద్ద స్టీలు బేసిన్లో పోసి ఉంచేవారు. పాలవెల్లికి కాస్త పసుపదీ రాసి వెలక్కాయలు, సీతాఫలాలు, నారింజలూ వేలాడదీసేసరికి ఎక్కడలేని అందమూ వచ్చేసేది. ఇక నాలుగుమూలలా నాలుగు మొక్కజొన్నపొత్తుల్ని కట్టేసరికి పూర్తి నిండుదనంతో కళకళలాడిపోయేది.
మావిడాకులు తోరణాల్లా ఎలా మారతాయి, పాలవెల్లికి పచ్చికాయల్ని ఏ రకంగా అలంకరించాలి అనేది నాన్నగారు ఏరోజూ మాకు నేర్పలేదు. ఆయన కూర్చుని శ్రద్ధగా చేస్తోంటే జాగ్రత్తగా గమనించి నేర్చుకున్నదే!
‘అదంతా ఆడవాళ్ల వ్యవహారం, మనం పూజ సమయానికి మహరాజులా వచ్చి కూర్చోవడమే!’ అనే సంస్కారం ఏనాడూ ఆయనలో గమనించలేదు.
ఓ పెద్ద చార్టు మీద స్కెచ్ పెన్నులతోనో, రంగు పెన్సిళ్లతోనో వినాయకుడి బొమ్మ తప్పనిసరిగా గీసేవాణ్ణి. ఆ కలర్ కాంబినేషన్లవీ సరిగా తెలిసేవి కావు. ఒక్కోసారి వికారంగా తయారైనా దేవుడి బొమ్మ కదాని ఎవరూ ఏమీ అనేవారు కారు.
మనకి ఏ సబ్జెక్టు వీకో ఆ పుస్తకం తెచ్చి దేవుడి పక్కన పెట్టమనేవారు. నేను టెక్స్టు పుస్తకంతోపాటు నోట్సులూ పెడుతుండేవాణ్ణి. ఆ కారణంగా దొంతి పెద్దదిగా కనబడేది. అదిచూసి ‘ఏరా, అన్నీ కష్టంగానే ఉన్నాయా నీకు?’ అంటూ అన్నయ్య ఏడిపిస్తూ ఉండేవాడు.
వ్రతకల్పంలో పత్రుల పేర్లు ఒకరకంగా ఉంటే మనం తెచ్చినవాటి పేర్లు ఇంకోరకంగా ఉండేవి. అప్పటికింకా మేటనీలే తప్ప బోటనీలవీ తెలీవు. అంచేత మొక్కల బహునామావళదీ పరిచయంలేదు.
గండకీపత్రం, దూర్వారయుగ్మం అంటూ గాంధారీ ధృతరాష్ట్రుల కొడుకుల పేర్లకుమల్లే ఉన్న ఆకులేవిఁటో మా చిన్నిబుర్రలకు అర్ధమయ్యేవి కావు. నాన్నగారు తనకు తెలిసినంతవరకూ కొన్నింటిని పరిచయం చేసేవారు. ఎప్పుడైనా బిల్వపత్రం పూజయామి అని చదవగానే గబగబా మూడూ కలిసివుండే మారేడుదళాల్ని వెదికి వెదికిమరీ తీసి దేవుడిమీద పడేసేవాళ్లం. ఆ క్షణం అదొక గర్వం, గొప్ప పనేదో చేసినట్టు.
పూజంతా అవ్వగానే కథ వినడం విధాయకమనే నిబంధన, ఒకవేళ వినకపోతే ఏం జరుగుతుందో తెలియజేసే సత్యనారాయణ వ్రతం విశేషాలూ బాగా నూరిపోసి ఉండటాన మొత్తం పిల్లలందరం నోరుమూసుకుని వినేవాళ్లం.
మధ్యలో నోరలా వెళ్లబెట్టి రోజుకి వెయ్యి మణుగుల బంగారమంటే ఏవిఁటని, ఉయ్యాల్లో ఆడుకునే పిల్లకి ఆ మణిని ఇవ్వడమేవిఁటని, ఇరవై ఎనిమిది రోజులపాటు యుద్ధం చేస్తే ఆకలదీ వెయ్యదా అని, అయినా ఆ ఉయ్యాల్లో పాపాయినిచ్చి పెళ్లి చెయ్యడమేవిఁటని వంద సందేహాలతో కొట్టుకుంటుండేవాళ్లం.
అయితేనేం, సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడికి అలానే అవ్వాలని తీర్మానం చేసేసుకునేవాళ్లం. జాంబవంతుడి గుహ మొత్తం కళ్లముందు త్రీడీలో కనబడిపోయేది. కుమారస్వామి ఏ నది దగ్గరకెడితే ఆ నదిలో వినాయకుడు కనబడేవాడని చెబుతోంటే ఆ సూపర్పవర్కి మనకి గూస్బంప్స్ వచ్చేసేవి.
‘మనం కూడా స్కూలుకెళ్లకపోయినా క్లాసురూములో కూర్చునున్నట్టు మేష్టారికి కనబడే శక్తి మనకొచ్చేస్తే?’ అనే దుష్ట దుర్మార్గపు ఆలోచనలకు బీజం పడింది కూడా ఆ వయసులోనే!
కాశీమజిలీ కథలవీ చదివేసి ఎగిరే గుర్రాల మీద ఎన్ని రాత్రుళ్లు ప్రయాణం చేసేవాణ్ణో? సరస్వతీ ప్రెస్కి పెన్ను కొనుక్కోవడానికి ఎగురుకుంటూ వెళ్తున్నట్టు కలొచ్చేది తరచుగా. అలాగే కృష్ణుడూ, వినాయకుడూ మనతోపాటు ఆడుకుంటున్నట్టు కూడా కలలొచ్చేసేవి. వాటికి హద్దా, అదుపా? ఫ్రీయేగా?
ఇంతటి ఊహాశక్తికీ కారణం.... అమాయకమైన బాల్యం. వేరే ఏ విధమైన లాజిక్కుల్నీ, తర్కవిచారణల్నీ పరిచయం చెయ్యని స్వచ్ఛమైన బాల్యం. అది సరైనదని కాదు నా అభిప్రాయం. కానీ ఎందుకో ఆ ఊహాలోకాలవీ బావుండేవనిపిస్తుంది. పాలసముద్రంలో విష్ణుమూర్తి కనబడగానే కళ్లు రెండూ పత్తికాయల్లా చేసుకుని దాదాపుగా వైకుంఠాన్ని కళ్లారా చూసేసినంత అనుభవం పొందేసేవాణ్ణి. మాంత్రికుల గుహల్లో కాళికామాత బొమ్మలూ, బలులిచ్చే రాతిదిమ్మలూ కూడా మనకు కావలసినంత కిక్కిచ్చేవి.
ఇప్పుడుమాత్రం ఏవిఁటటా? ఇంతంత శాస్త్రవిజ్ఞానమూ, తర్కమూ అభివృద్ధి చెంది, మన బుర్రల్లోకి సిలబస్సుల్ని ఎక్కించి, మన గుండెల్లో రైళ్లని పరుగెత్తిస్తున్న ఈ నవనాగరిక ప్రపంచంలో వస్తున్న కథలవీ చూసుకుంటే నా సామిరంగా!
ఎప్పుడో కోట్ల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన రాక్షసబల్లుల్నీ, మా విజీనారం జిల్లాంత సైజుండే గాడ్జిల్లాలనీ చూపిస్తున్నారు.
సరే, కథలోంచి పిట్టకథకొచ్చేశాను. కథాక్షతలు వేసేసుకున్న మరుక్షణం పేద్ద గొంతులేసుకుని ‘ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదకీ దండుపంపూ...!’ అంటూ పాడేసేవాళ్లం. అది పాడితేనే పూజ పూర్తైనట్టు. పెరుగన్నం తినకండా భోజనం పూర్తవనట్టన్నమట!
సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురుచూడటం, మాటిమాటికీ అమ్మ అనుమతి కోసం పీడించడం. కాస్తంత చీకట్లు పడగానే వీధిలో పిల్లలందరం కలిసి ఏడుగాని, తొమ్మిదిగాని వినాయకుళ్లని చూడాలంటూ కాలినడకన బయలుదేరేవాళ్లం. ఇంటి ఓనర్లనో, పక్కవాటాలో గుట్టుగా కాపరముండే సర్వేయరుగారినో తలుపు తియ్యమని బాది, ఆనక దేవుడిగదుల్లో దూరిపోయి గుంజిళ్లూ, లెంపలూ కానిచ్చేసి అప్పుడు వీధిన పడేవాళ్లం.
అప్పుడిలా వీధికో వినాయకుడుండేవాడు కాడు. మనుషుల్లో ఐక్యతలవీ ఏడిసేవి. ఒక పేటకి ఒకడే దేవుడు. బాగా పెద్దవాడు. శుభ్రంగా తొమ్మిదో, ఇరవయ్యొకటో రోజులుండేవాడు. బోలెడన్ని ప్రసాదాలు పంచిపెట్టేవాడు. చివర్లో కాకినాడ బాబ్జీ ఆర్కెస్ట్రానో, సత్యనారాయణ మిమిక్రీనో పెట్టించేవాడు. పిల్లలకి పాటలపోటీలవీ జరిపించేవాడు. ఆ పందిళ్లలో జవజీవాలుండేవి. కళలు నాట్యమాడేవి.
ఇప్పటికీ అటువంటి పందిళ్లు అక్కడక్కడ కనబడుతున్నాయి. కూచిపూడి నృత్యాలనూ, శాస్త్రీయ సంగీతాలనూ వేదికనెక్కిస్తున్న రసహృదయాలు తారసపడుతున్నాయి.
నిన్న మాయింట్లో పూజచేసేసుకుని, అపార్ట్మెంట్ గణపతినీ ఆరాధించి సాయంత్రం వీధి గణపతుల్ని చూసేందుకు బయల్దేరాం. అదృష్టవశాత్తు జీడిగింజలు, బుల్లెట్ బళ్ళూ వినబడలేదు. నవగ్రహాలనూ మంటపంలోకి ఆవాహన చెయ్యడంలో ఉన్న మర్మాన్ని విశదీకరిస్తున్న బ్రహ్మగారు ఒక పందిట్లో తారసపడితే, గోపికలంతా చేరి కృష్ణుడి లీలల్ని పాడే కోలాటాల నృత్యం మరొకచోట కనబడింది.
ఈ పండగలో అదే విశేషం. పదిమందినీ కలుపుతుంది. కళల్ని ప్రోత్సహిస్తుంది. స్నేహభావం పెంపొందేలా సరదా సంతోషాల్ని నింపుతుంది. మానవ సహజమైన అసూయల్నీ, చిన్నచిన్న విభేదాల్నీ పక్కనబెట్టేలా చేస్తుంది. ఏళ్లతరబడి మాటడుకోవడాలవీ మానేసిన కొందరు మిత్రుల్ని మళ్లీ ఏ పొరపొచ్చాలూ లేకుండా మాటాడేసుకునేలా చేస్తుంది.
వినాయచవితి సంబరమనేది కేవలం ఆ దేవుడికి మనం చేసే ఉత్సవం మాత్రమే కాదు. మనల్ని మనం సంస్కరించుకునేందుకు మనమే కల్పించుకునే అవకాశం. ఈ చిన్ని జీవితంలో నిజమైన కష్టాలనేవి ఏమిటో తెలియజేసేందుకు దేవుడు సునామీలని, హుద్హుదుల్ని, కరోనాలనీ పంపాడు. అప్పుడు పడగవిప్పిన మానవత్వం మళ్లీ కాస్త తెరిపిరాగానే కుంచించుకుని బుట్టలోకో, పుట్టలోకో పోతోంది. వీటన్నిటినుంచీ బయటపడిన స్వచ్ఛమైన మనసులతో నిండైన స్నేహాల్ని ఆస్వాదించండి.
.........కొచ్చెర్లకోట జగదీశ్
0 comments:
Post a Comment